వినుకొండ: వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డిపై పల్నాడు జిల్లా డీసీహెచ్ఎస్ ప్రసూన మంగళవారం విచారణ చేపట్టారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డితోపాటు మహిళా సిబ్బంది, డాక్టర్లను వేర్వేరుగా విచారించారు. అనంతరం పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతకాలంగా ఆయన మహిళా డాక్టర్లు, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు వేధింపులకు గురి చేస్తుండడంతో ఇరువురు మహిళా డాక్టర్లు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని, అంతేగాక పలు ఫిర్యాదులు రావడంతో రహస్య విచారణ చేపట్టినట్లు ఆమె చెప్పారు.
సూపరింటెండెంట్పై విమర్శల వెల్లువ
వినుకొండ పట్టణం వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పనితీరుపై ఆసుపత్రి సిబ్బంది, మహిళా డాక్టర్లు తీవ్రస్థాయిలో విచారణ అధికారి ఎదుట గళం విప్పారు. చిన్న చిన్న విషయాలను కూడా రాద్ధాంతం చేస్తూ ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని, మహిళా డాక్టర్లు పక్కకు వెళ్లిన సమయంలో ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని, నర్సుల వ్యక్తిగత డ్రస్సింగ్ రూమ్ల్లోకి వెళ్లి శుభ్రత పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులను తన సొంత వైద్యశాలకు రిఫర్ చేయడం, వైద్య పరీక్షలు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు పంపడంతోపాటు ఇటీవల ప్రభుత్వ వైద్యశాలలో ఒక ప్రైవేటు వైద్యునిచే ఆపరేషన్ చేయించారని పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి సూపరింటెండెంట్గా కొనసాగితే మహిళా సిబ్బంది సెలవు పెట్టడం తప్ప చేసేదేమీ లేదని స్పష్టం చేశారు.
శ్రీనివాసరెడ్డిపై మహిళా డాక్టర్లు,
సిబ్బంది ఫిర్యాదు
వేధింపులతో దీర్ఘకాలిక సెలవుపై
వెళ్లిన మహిళా డాక్టర్లు
తీవ్ర ఆరోపణల నేపథ్యంలో
రహస్య విచారణ చేపట్టిన డీసీహెచ్ఎస్


