జయపురం: జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని ముగ్గురు యువకుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసగించిన సంఘటన వెలుగు చూచింది. లక్ష్మీకాంత హల్బా అనే వ్యక్తి యువకులకు నకిలీ నియుక్తి పత్రాలు అందజేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. మోసానికి గురైన యువకులు జయపురం సదర్ పోలీసు స్టేషన్లో లక్ష్మీకాంత హల్వాపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంత హల్వ జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపి మొదట వారికి చెప్పి వారిలో తనపై విశ్వాసం కలిగించాడు. కెఆర్పీసీ ఔట్సోర్సింగ్ పేరుగల ఒక ఏజెన్సీ ద్వారా హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మొదట ఇన్స్యూరెన్స్, ఆధార్ కార్డుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5000 చొప్పున వసూలు చేశాడు. అదేవిధంగా వారి స్నేహితుల నుంచి కూడా ఉద్యాగాలు ఇప్పిస్తానని మొత్తం రూ.2 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. డబ్బులు తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించకపోవటంతో తమ డబ్బులు వాపస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అతడు డబ్బులు తిరిగి ఇవ్వనందుకు లాయర్ను కలిసి ఫిర్యాదు చేశారు
గణనాథుని పూజలకు ముహూర్తపు రాట
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలు నడుం బిగించారు. మహిళా స్వాభిమాన్ మంచ్ మహాగణపతి పూజా కమిటీ పేరిట ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉత్సవ వేదిక ప్రాంగణంలో మహిళలంతా మూహూర్తపు రాట వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తి శ్రద్ధలతో మూహూర్తపు రాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులు నిర్వహిస్తామని కమిటీకి చెందిన మహిళలు తెలిపారు. ఏటా తమ కాలనీలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈసారి తమ ప్రాంత మహిళలంతా సమైఖ్యతగా ఉత్సవాలను నిర్వహించేందుకు నడుం బిగించాన్నారు.
విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం
రాయగడ: విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లాలోని బిసంకటక్ పోలీసులు శనివారం రాత్రి బిసంకటక్ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 పెట్టెల్లో ఉన్న 190 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల రాకను గమనించిన అక్రమ రవాణాదారులు మద్యం బాటిళ్ల పెట్టెలను విడిచి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పది అడుగుల మొసలి ప్రత్యక్షం
జయపురం: జయపురం సమితి జయంతిగిరి గ్రామ పంచాయతీ మలదా మీదుగా ప్రవహించే బొడొపొడ నదిలో పది అడుగుల మొసలి స్థానికులకు సోమవారం కనిపించింది. మలదా గ్రామ ప్రజల కొంత మంది నదిలో వెళ్లున్న మొసలిని చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేశారు. నదిలో మొసలి కనిపించటంతో తరచూ నది దాటి వెళ్లే మలదా, బొడొపొడ, తదితర గ్రామాల ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు.


