ఇచ్ఛాపురం: గంజాయి అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఝార్ఖండ్ రాష్ట్రానికి యువకుడిని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాం వెనుక వైపునున్న రోడ్డు కూడలిలో పట్టణ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగభూమ్ జిల్లా తుంటకట గ్రామానికి చెందిన రాజ్అభిషేక్ రాజ్ఞ సింకు 5 కేజీల గంజాయి కలిగిన సూట్ కేస్తో వస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. నిందితుడిని విచారించగా అతని ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసే తన దగ్గరి బంధువు అయినటుంటి ఝార్ఖండ్లోని నయాగామ్ గ్రామానికి చెందిన అనురాగ్పట్ సింగ్విని కలిసి పని కల్పించాలని కోరాడు. దీంతో అతను ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చే సమయంలో సాయం చేస్తే రూ.10 వేలు ఇస్తానని చెప్పడంతో అంగీకరించాడన్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా నుంచి పలుదపాలుగా గంజాయిని తరలించినట్లు అంగీకరించాడు. ఇదేవిధంగా కందమాల్లోని కరణ్నాయక్ అలియాస్ దేబదాస్నాయక్ వద్ద నుంచి మంగళవారం 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాం జిల్లా చీకటి మీదుగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి చేరుకొని, అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకొని అటుగా ఝార్ఖండ్కి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాం వద్దకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి గంజాయితో పాటు సెల్ఫోన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


