● బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ జ్యోతీ పాణిగ్రహి
జయపురం: పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును విపక్షాలు కక్షకట్టి ఓడించాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోతీ పాణిగ్రహి ఆరోపించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా బిల్లు ఓటమిపై విపక్షాలను ఆక్షేపించారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు పార్లమెంట్, శాసన సభలలో ప్రాధాన్యం కల్పించటం బీజేపీ ప్రధాన లక్ష్యం అన్నారు. అయితే మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకొని తప్పు చేశాయన్నారు. మహిళలు క్షోభించిన ప్రభావం భవిష్యత్తులో విపక్షాలు అనుభవిస్తాయన్నారు. అయితే ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మహిళా మోర్చా నేతలు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా 2023లో మహిళా సంవరక్షణ బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడినా కేంద్రంలోని మోదీ సర్కార్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట కార్యదర్శి పూర్ణిమ నాయిక్, కొరాపుట్ జిల్లా అధ్యక్షురాలు శ్వాతీహోత్త, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు అంజళీ మిశ్ర ఉన్నారు.


