మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొంఢ సమితి నాక్కమామ్ముడి పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధామేశ్ అర్వింద్ రాజశిర్కే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి..లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయపోడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే బహుముఖ కమ్యూనిటీ సెంటర్ గురించి గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని బీడీవోను ఆదేశించారు. దామదరబెడా గ్రామంలో వంతెన యోజన క్రింద నిర్మాణంలో ఉన్న రూ. 30 లక్షల బాక్స్ సెల్ కల్వర్ట్ పనులు వార్షాకాలానికి ముందుగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా జరుగుతున్న 40 ఇళ్ల పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, పీఏ ఐటీడీఏ హలధర్ శబర్, కోరుకొండ సమితి ఉద్యోగులు పాల్గొన్నారు .


