ఏకామ్ర కాన గుభాళింపు
భువనేశ్వర్: ఏటా శీతాకాలంలో నిర్వహించే వార్షిక పుష్ప ప్రదర్శన–2026తో ఏకామ్ర కానన్గుభాళిస్తోంది. ప్రాంతీయ మొక్కల వనరుల కేంద్రం (ఆర్.పి.ఆర్.సి.) బొటానికల్ గార్డెన్లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను రాష్ట్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పువిభాగం మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా ప్రారంభించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు విభాగం, ఆర్పీఆర్సీ, మొక్కల ప్రేమికుల సంఘం సహకారంతో నిర్వహించిన ఈ 37వ పుష్ప ప్రదర్శన ప్రకృతి, సంప్రదాయం, పూల ఉత్సవం నినాదంతో నిర్వహించారు. ఈ ప్రదర్శన ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు ప్రజలకు తెరిచి ఉంటుంది. ఈ పుష్ప ప్రదర్శనలో స్థానిక, అన్యదేశ రకాల గులాబీలు, గ్లాడియోలస్, గెర్బెరా, పెటునియాస్, లిల్లీస్, ఆర్చిడ్లు, శీతాకాలపు కాలానుగుణ పువ్వుల ఆకర్షణీయమైన ప్రదర్శన ఆహ్లాదపరుస్తుంది. సహజ ఇతివృత్తాల ఆధారంగా పూల అలంకరణలు, పూల కళాకృతులు, పువ్వుల ద్వారా ఒడియా సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించడం ఈ ప్రదర్శన ప్రధాన ఆకర్షణ. ఈ ప్రసిద్ధ పుష్ప ప్రదర్శనలో రంగురంగుల పుష్పాలు, వివిధ రకాల కళాత్మక ప్రదర్శనలు నగరవాసులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూలతో అలంకరించిన ప్రవేశ ద్వారం, సహజ సౌందర్యం తనను మంత్రముగ్ధులను చేశాయన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు. అత్యాధునిక టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అరటి, ఆర్చిడ్, వివిధ పుష్పించే మొక్కలను పెద్ద సంఖ్యలో ప్రచారం చేయడం రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ రంగానికి ఎంతో సహాయపడుతుందన్నారు. ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ జ్యోతి శర్మ, పీసీసీఎఫ్ సురేష్ పంథ్ మరియు ఆర్.పి.ఆర్.సి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధాంషు శేఖర్ ఖోరా గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
మొక్కల పరిశోధనకు ఒప్పందం
ఈ సందర్భంగా మొక్కల పరిశోధన రంగంలో మరింత అభివృద్ధి కోసం ప్రాంతీయ మొక్కల వనరుల కేంద్రం (ఆర్.పి.ఆర్.సి.) సిక్కింలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ (ఎన్ఆర్సీఓ), లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ (ఐఐఎంటీటీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఏకామ్ర కాన గుభాళింపు


