ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. గూడవల్లికి చెందిన జి. రామ్మోహనరావు దంపతులు రూ. లక్ష, ముమ్మిడివరానికి చెందిన సీహెచ్ నటరాజు, సత్య అమర తులసీ రూ. 1,41,200 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారి నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
జి.కొండూరు: బడి ఈడు పిల్లలను తప్పక పాఠశాలల్లో చేర్పించే విధంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, డీఈఓ ఎల్. చంద్రకళతో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులతో ముచ్చటించారు. స్థానిక ఎంపీయూపీ, జెడ్పీ హై స్కూలును సందర్శించారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్బాబు, ఎంఈఓలు రాజు, వీరాస్వామి పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో చదువులో రాణించాలి
హనుమాన్జంక్షన్ రూరల్: విద్య ద్వారానే సమాజంలోని అసమానతలను తొలగించగలమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో చదువులో రాణించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమతి జగడం అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలో విశ్రాంత ఉపాధ్యాయుడు దారం శామ్యూల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని గురువారం రాత్రి ఆమె ఆవిష్కరించారు. సభాధ్యక్షుడిగా అంబేడ్కర్ వాది పంతగాని రమేష్ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగ హక్కులను నిర్లక్ష్యం చేయవద్దని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు చైతన్యవంతులు కావాలని చెప్పారు. రిటైర్డ్ ఆర్డీవో సీహెచ్ రంగయ్య, రిటైర్డ్ డీఎస్పీ ఎస్.శుభాకర్, రిటైర్డ్ ఎంపీడీవో వేమూరి ఎంజల్ విజయకుమార్, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు పాల్గొన్నారు.
పక్కాగా జనగణన
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ప్రసన్న కుమార్ పరిశీలించారు. వీఎంసీ సెన్సెస్ ఇన్చార్జ్ వెంకటరమణ, సిటీ సెన్సెస్ ఆఫీసర్, అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఆధ్వర్యంలో శుక్రవారం మధురానగర్, ఊర్మిళా నగర్ ప్రాంతాలలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని సందర్శించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పనితీరును సమీక్షించారు. ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కమిషనర్ ప్రజల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జనగణన నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు.


