గన్నవరం: మండలంలోని కేసరపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను కృష్ణా జిల్లా పరిషత్ సీఈఓ, జనగణన గన్నవరం నియోజకవర్గ ప్రత్యేకాధికారి జె.అరుణ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని ఐటీ పార్కు సమీపంలోని ఇళ్లను ఆమె స్వయంగా సందర్శించి ఎన్యూమరేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం నమోదును పరిశీలించిన ఆమె ఎన్యూమరేట్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గన్నవరం మండలంలో ఇప్పటి వరకు 67.9 శాతం జనగణనను పూర్తిచేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో ఎన్యూమరేట్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లు పనిచేసి నిర్ణీత గడువులోపు కచ్చితత్వంతో జనగణనను పూర్తిచేయాలని సూచించారు. మండలంలో ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి సమగ్ర సమాచారంతో జనగణన నమోదు చేయాలని స్పష్టంచేశారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, ఎంపీడీఓ టి.స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఎస్.ఆర్.వి.ప్రసాద్, ఎన్యూమరేటర్ తదితరులు పాల్గొన్నారు.


