ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మే నెలాఖరు వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 27 క్రీడా విభాగాల్లో ఈ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్జంక్షన్ రూరల్: ఆర్టీసీ బస్స్టేషన్లలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజారవాణాధికారి కె.వెంకటేశ్వర్లు అన్నారు. హనుమాన్జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికుల కోసం ప్రతి బస్స్టేషన్లో రక్షిత మంచినీరు, శుభ్రమైన టాయిలెట్లు, కూర్చునేందుకు బెంచీలు, ఫ్యాన్లు, తడి, పొడి చెత్త వేయడానికి వేరుగా డస్ట్బిన్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అలాగే వారి కోరిన చోట దింపాలని చెప్పారు. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూపాలని సూచించారు. ఆయన వెంట గన్నవరం ఆర్టీసీ డిపో మేనేజర్ శివాజీ, ట్రాఫిక్ సూపర్వైజర్ మధు ఉన్నారు.


