మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా పోరంకిలోని విజ్ఞాన్ భారత్ స్కూల్ ఆవరణలో కృష్ణాజిల్లా అండర్–19 చెస్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో బుధవారం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ టోర్నమెంట్లో మొత్తం 37 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరికి ఐదు రౌండ్లలో జరిగిన పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని వారిలోని ప్రతిభను చాటారు. బాలుర విభాగంలో కె.సందీప్, ఈ.లలిత్ కౌశిక్, ఎం.కార్తికేయ, జే.విగ్నేష్ గుప్తా, బాలికల విభాగంలో కె.పావని, శివశరణ్య, హేశ్రీత, ఎం.గీతామాధురి విజేతలుగా నిలిచారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రా చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ అతిథిగా హజరై విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెస్ క్రీడలో శిక్షణ పొందడం వల్ల విద్యార్థుల్లో ఏక్రాగత, ఆత్మవిశ్వాసం, ఓర్పు పెరుగుతాయని, దీనివల్ల విద్యలో కూడా రాణించవచ్చునని అన్నారు. టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ను అందజేశారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ చూపిన బాలబాలికలు జూన్ 27,28 తేదీల్లో అనకాపల్లిలో జరిగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్–19 చెస్ చాంపియన్షిప్లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. విజ్ఞాన్ భారత్ స్కూల్ డైరెక్టర్ శేషాద్రి రావు, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్య, చీఫ్ ఆర్బిటర్ ఎ.మణి రత్నం విజేతలకు బహుమతులు అందజేశారు.


