మధురానగర్(విజయవాడసెంట్రల్): విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని ముత్యాలంపాడు శ్రీ షిర్డీసాయిబాబా మందిరం గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ షిర్డీసాయిబాబా మందిరంలో బుధవారం పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సత్కారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతంరెడ్డి పదోతరగతి పరీక్షలలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన దాక్షాయణి(586 మార్కులు), సెకండ్ ర్యాంక్ సాధించిన కె. లోహిత (584 మార్కులు), థర్డ్ ర్యాంక్ సాధించిన కె.రామ్ చరణ్ (583 మార్కులు)తో పాటు నగరపాలకసంస్థ పాఠశాలల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన పదోతరగతి విద్యార్థులను బాబావారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందిరం తరఫున వీఎంసీ పాఠశాలలో చదువుతున్న కొంతమంది పదోతరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను చెల్లిస్తున్నామని, వారిలో ఎంతోమంది త్రిపుల్ఐటీ తదితర ప్రతిష్టాత్మక కోర్సులలో సీట్లు సాధించారని అన్నారు. అనంతరం విద్యార్థులతో పాటు విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సత్కరించారు. మందిర కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, సభ్యులు విజయకుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి


