భవిష్యత్ అవసరాల మేరకు హైవే అభివృద్ధి
ఎంపీ కేశినేని శివనాథ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారుల నెట్వర్క్ను అభివృద్ధి చేయడం ముఖ్యమని.. ఈ నేపథ్యంలో ఎన్హెచ్–65 విస్తరణ ఉండాలని కోరుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల (స్టేక్హోల్డర్స్) సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్అండ్బీ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో పాటు ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వసంత వెంకట కృష్ణప్రసాద్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గద్దె రామ్మోహన్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి–65 ఆరు వరుసల విస్తరణకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో హైదరాబాద్–విజయవాడ–మచిలీపట్నం ఎన్హెచ్ 65 విస్తరణకు సంబంధించి కొంతవరకు డీపీఆర్ తయారైందన్నారు. ఈ డీపీఆర్ను పరిశీలించిన మీదట ఎక్కువమంది రైతులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. విస్తరణలో ప్రతిపాదించిన రెండు బైపాస్లు (అంబారిపేట–ఐత వరం; కాచవరం–మూలపాడు–ఇబ్రహీంపట్నం వెస్ట్) బదులు పాత రహదారినే పటిష్ట ప్రణాళికతో విస్తరణ, అభివృద్ధి చేయాలని తీర్మానం చేశామన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ (విజయవాడ) ఎం.విద్యాసాగర్, ఎన్హెచ్ పీడీ (హైదరాబాద్) సీహెచ్ శ్రీనివాసరావు, పీడీ (అమరావతి) టి.పార్వతీశం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.


