ఏసీబీకి చిక్కిన డెప్యూటీ తహసీల్దార్
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.12 వేల లంచం డిమాండ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో అవినీతి ఏ విధంగా రాజ్యమేలుతోందో చెప్పడానికి ఇటీవల జరుగుతున్న ఏసీబీ దాడులే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఏకంగా రూ.45 వేల లంచం తీసుకుంటూ అయోధ్యనగర్ 229, 231 సచివాలయాలకు చెందిన ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. తాజాగా ఓ డెప్యూటీ తహసీల్దార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ చేతికి చిక్కిన ఘటన శనివారం జరిగింది.
ఎఫ్ఎంసీ కోసం రూ.12 వేలు తీసుకుంటూ..
విజయవాడ వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన ఉప్పాడ సాయి(26) నానమ్మకు వాంబేకాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ గృహానికి సంబంధించిన లావాదేవీల విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సాయి తండ్రి రాము గత నెల 29వ తేదీన స్థానిక మీ–సేవ కేంద్రం ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోజులు గడుస్తున్నా తమకు సర్టిఫికెట్ రాకపోవడంతో రాము స్థానిక వార్డు రెవెన్యూ కార్యదర్శిని కలువగా ఆయన సింగ్ నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటీ తహసీల్దార్, ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చింతకాయల అప్పారావును కలవాలని సూచించారు. దీంతో అప్పారావును రాము కలవగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.12 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం ఉదయం దరఖాస్తుదారులను సింగ్నగర్లోని నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని రూ.12 వేల లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా అప్పారావును పట్టుకున్నారు. డీటీ కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నిందితు డిని హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ బి.వి. సుబ్బరావు తెలిపారు. చింతకాయల అప్పారావు 2003లో కారుణ్య నియామకం కింద ఆఫీస్ సబార్డినేట్గా చేరి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు ప్రదేశాల్లో పనిచేసి 2022లో రీ సర్వే డెప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగోన్నతి పొందాడు. 2024లో నార్త్జోన్ డెప్యూటీ తహసీల్దార్, ఇన్చార్జ్ ఆర్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అప్పారావుపై పలు అవినీతి ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు గతంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలి సింది. ఏసీబీ సీఐలు ఎం.వి.ఎస్.నాగరాజు, జి.వి.వి.సత్యనారాయణ, ఎస్ఐ పూర్ణి, ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే జిల్లా ఏసీబీ అధికారులకు నేరుగా కానీ, ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, మోబైల్ నంబర్ 94404–40057కు కానీ తెలపాలని ఏసీబీ అధికారులు కోరారు.


