వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయం
విజయవాడ కల్చరల్: వాగ్గేయకార సాహిత్యం సదా స్మరణీయమని విశ్రాంత అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు అన్నారు. స్వరఝరి సంగీత సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే తెలుగు భాషా సంగీత మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి సభకు అధ్యక్షత వహించారు. అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎంఎస్ఎం రమాశ్రీ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్లో స్వరఝరి సహకారంతో 16 ఏళ్ల లోపు యువ కళాకారులు లక్ష మందితో ప్రపంచ బాల మహోత్సవం నిర్వహిస్తామన్నారు. సభలో విద్యావేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. స్వరఝరి కార్యదర్శి మోదుమూడి సుధాకర్ సభను నిర్వహించారు.
సంగీత సాహిత్యాలకు వేదిక
తొలి రోజు కార్యక్రమంలో వయోలిన్ విద్వాంసుడు గండూరి శ్రీనివాసమూర్తి బృందం కీర్తనలను ఆలపించారు. రాకమర్ల వెంకటదాసు కీర్తనల వైశిష్టి అంశంగా డాక్టర్ శేషులతా విశ్వనాథ్ ప్రసంగించారు. అన్నమయ్య తెలుగుభాషా సౌందర్యం అంశంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ టేకుమళ్ళ వెంకటయ్య మాట్లాడారు. సినీ సంగీతంలో తెలుగుభాష అంశంగా కె.శాంతిశ్రీ ప్రసంగించారు. పి.సదాశివశాస్త్రి అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఆంధ్రేతర వాగ్గేయకార రచనల వివరాలను ఆకొండి శ్రీనివాసరావు, లలిత సంగీత శిఖరాలు రజనీకాంతరావు, మల్లిక్ సాహిత్య విశేషాలను వివరించారు. భద్రాచల రామదాసు కీర్తనలను తుషార పూర్ణవిల్లి వివరించారు.
ప్రారంభమైన తెలుగుభాషా సంగీత మహాసభలు


