నగర పౌరులపై పన్నుల భారం లేని బడ్జెట్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని సూచించేలా, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా 2026–27 ఏడాది వార్షిక బడ్జెట్ను రూపొందించా మని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశం మంగళవారం జరిగింది. మేయర్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. తమ హయాంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ స్వచ్ఛ లీగ్లో మొదటి స్థానం పొందామని, గార్బేజ్ ఫ్రీ సిటీలో సెవెన్ స్టార్ ర్యాంకింగ్, మురుగునీటి శుద్ధీకరణలో ఫైవ్స్టార్ రేటింగ్ సాధించామన్నారు. నగరంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు రెవెన్యూ కేపిటల్ ఆదాయం రూ.1,894.57 కోట్లు, ప్రారంభ నిల్వ రూ.2,213.28 కోట్లు ఉందని వివరించారు. రెవెన్యూ, క్యాపిటల్ వ్యయాల్లో లోన్, డిపాజిట్లు చెల్లింపులతో కలిపి రూ.2,093 కోట్లు ఉందని, 2025–26 సవరించిన రెవెన్యూ, క్యాపిటల్ ఆదాయాలు రూ.1,130 కోట్లని, రెవెన్యూ క్యాపిటల్ వ్యయం రూ.1,175 కోట్లని పేర్కొన్నారు.
సమావేశాన్ని తప్పుదారి పట్టించే యత్నం
2026–27 వార్షిక బడ్జెట్లో నగరపాలక సంస్థ పరి ధిలోని మూడు నియోజకవర్గాల్లో రూ.600 కోట్లతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణాలు చేపట్టేందుకు ఖర్చుచేయాలని, ఇందుకు రూ.300 కోట్లు వీఎంసీ రుణాల ద్వారా సేకరించాలని, రూ.150 కోట్లు సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించాలని, మరో రూ.150 కోట్లు సీఆర్డీఏ సమకూరుస్తుందని బడ్జెట్లో అధికారులు పొందుపరిచారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలి పారు. ఈ ప్రతిపాదన స్థాయీసంఘం సమావేశం దృష్టికి వచ్చిన సమయంలోనే సభ్యులు అభ్యంతరం తెలిపారని, అయినా అధికారులు బడ్జెట్లో ఎలా పొందుపరుస్తారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరానికి ప్రత్యేక నిధుల కేటాయించాలని, అలా కాకుండా నగరపాలక సంస్థను అప్పులపాలు చేసేందుకు యత్నిస్తోందని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు విమర్శించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు కల్పించుకుని సభను తప్పుదోవపట్టించేలా కేకలు వేశారు. ఈ ఓవైపు మునిసిపల్ కమిషనర్ ధాన్యనచంద్ర వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నా టీడీపీ నాయకులు ఖాతరు చేయలేదు. పీపీపీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఎంసీపై రూ.450 కోట్లు భారం మోపేలా అధికారులు పొందుపరిచిన స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ ప్రతిపాదనలను తొలగించి 2026–27 సవరణ బడ్జెట్ను మేయర్ భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ చేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. డ్రాఫ్ట్ బడ్జెట్ పుస్తకంలో 40వ పేజీలో ఉన్న రూ.150 కోట్లు, కన్సెషనరీ సమకూర్చే రూ.300 కోట్లు వ్యయం, 51వ పేజీలో పొందుపరిచిన 70, 72వ అంశాలు, రూ.450 కోట్లు క్యాపిటల్ వ్యయం మినహా మిగిలిన బడ్జెట్ను మెజారిటీ సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదిస్తూ తీర్మానం చేశారు.
సీపీఎం డీసెంట్ నోట్
నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పీపీపీ పద్ధతిలో స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ నిధుల ఖర్చు వ్యవహారంలో సీపీఎం ఫ్లోర్లీడర్ సత్తిబాబు మేయర్ రాయన భాగ్యలక్ష్మికి డీసెంట్ నోట్ అందించారు. ఈ బడ్జెట్లో రూ.450 కోట్ల రుణం రూపంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను గ్రాంట్స్గా కేటాయించాలని డీసెంట్ నోట్లో పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు గతంలో స్ట్రాంగ్ వాటర్ డ్రెయిన్ పథకానికి కేటాయించిన రూ.460 కోట్ల నిధుల్లో రూ.172 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన రూ.289 కోట్లు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు.
ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి
స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులకు పీపీపీ విధానంలో రూ.450 కోట్లు ఖర్చు చేయాలని టీడీపీ పట్టు
సభ్యుల ఓటింగ్తో నిధుల కేటాయింపు ప్రతిపాదనల తిరస్కరణ


