జల్లు స్నానాలకు ఇక చెల్లు
విజయవాడ దుర్గాఘాట్లో
నేటి నుంచి నదీ స్నానం ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులు, యాత్రికులు ఇకపై దుర్గాఘాట్లో నదిలోకి దిగి స్నానాలు చేసేందుకు వీలు కల్పిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి భక్తులు నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత నాలుగు రోజులుగా స్నానఘాట్ లో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలు, బురదను పొక్లయిన్తో తొలగించే పనులు చురుగా సాగాయి. స్నానాలు చేసే వారు నది గర్భంలోకి వెళ్లకుండా ఉండేందుకు పది అడుగుల ఎత్తులో స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా అనంతరం నదిలోకి పుణ్యస్నానాలు ఆచరించకుండా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కరోనా అనంతరం నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో మరికొంత కాలం నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించడం సాధ్యం కాలేదు. ప్రత్యామ్నాయంగా జల్లు స్నానాలకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఏడాది మహా శివరాత్రికి దుర్గాఘాట్లోని నదిలోకి దిగి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లు..
పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం బస్సులను ఏర్పాటు చేసింది. నడక దారిలో వెళ్లే వారి కోసం అండర్ పాస్ను నిర్మించింది. నదీ తీరం నుంచి నేరుగా దేవస్థాన కేశఖండనశాల వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఘాట్రోడ్డులో కామథేను అమ్మ వారి ఆలయానికి చేరుకుంటారు. దుర్గాఘాట్లో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, లగేజీ భద్రపరుచుకునేందుకు క్లోక్రూమ్లు, చెప్పుల స్టాండ్లను అందుబాటులో ఉంచింది.


