విశ్వాసానికి మూలస్తంభం మరియతల్లి
గుణదల(విజయవాడ తూర్పు): యావత్ క్రైస్తవ విశ్వాసానికి మరియతల్లి మూల స్తంభంగా నిలిచిందని, ఆమె ద్వారా సకల జనులు దీవెనలు పొందుతున్నారని నిడమానూరు రీజనల్ సుపీరియర్ ఫాదర్ బాలాజీ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న నవదిన ప్రార్థనల్లో ఐదవ రోజు బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మరియతల్లిని ఆశ్రయించిన భక్తులకు ఆమె అండగా నిలుస్తుందన్నారు. కుల, మతాలకు అతీతంగా సర్వజనులకు ఆమె తనయుడు ఏసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గం లభించిందన్నారు. అనంతరం మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొండపై ఉన్న ప్రత్యే బలిపీఠం వద్ద సమష్టి దివ్యబలి పూజ నిర్వహించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందచేశారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు, ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, ఫాదర్ మరియన్న, తదితరులు పాల్గొన్నారు.


