మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. ఏలూరు రోడ్డులో గల సోషల్ సర్వీస్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలలో మూడు రోజుల పాటు గుణదల లూర్ధుమాత మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు ఆంధ్ర ప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలివస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఏడాది ఉత్సవాలను సమర్థంగా జరుపుతామని చెప్పారు.
పోస్టర్ ఆవిష్కరణ..
తిరునాళ్లలో సమష్టి దివ్యబలి పూజలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాత్రికులు మరియమాతను దర్శించుకొని దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం మేరీమాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు పాల్గొన్నారు.
విజయవాడ ఐసీఏఐకు బెస్ట్ అవార్డు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బ్రాంచ్కు, సికాసా (ఐసీఏఐ విద్యార్థి విభాగం)బ్రాంచ్కు కలిపి ఒకే సారి ఫస్ట్ బెస్ట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కంచమరెడ్డి నారాయణ చెప్పారు. స్థానిక ఐసీఏఐ భవన్లో జరిగిన సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కంచమరెడ్డి నారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఐసీఏఐ బ్రాంచ్ల్లో తమ బ్రాంచ్కు ఫస్ట్ బెస్ట్ ఐసీఏఐ అవార్డుతో పాటుగా తమ బ్రాంచ్ విద్యార్థి విభాగం అయినా సికాసాకు కూడా ఫస్ట్ బెస్ట్ అవార్డు లభించిందన్నారు. అవార్డును న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన వరల్డ్ ఫోరమ్ ఆఫ్ అకౌంటెంట్స్ (డబ్ల్యూఎఫ్వో) నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారని నారాయణరెడ్డి చెప్పారు.
పరీక్షల షెడ్యూల్ విడుదల
మచిలీపట్నంఅర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీటీసీ) పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 18న నిర్వహించగా, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు పది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో డ్రాఫ్టింగ్, గార్మెంట్ మేకింగ్, కట్టింగ్, ఎంబ్రాయిడరీ అంశాలపై పరీక్షలు జరుగుతాయని వివరించారు. మరిన్ని వివరాలకు www.bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు


