డివైడర్ను ఢీకొట్టింది
బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
కట్టంగూర్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. మియాపూర్ డిపో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఎరసానిగూడెం గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ ఓవర్ టేక్ చేసే యత్నంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టగా డ్రైవర్ అప్రమత్తమై ఆపడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అత్యవసర డోర్ తెరిచి కిందికి దిగారు. ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారిని అధికారులు మరో బస్సులో పంపించారు.
వాగులో పడి పశువుల కాపరి ..
వీరులపాడు: ప్రమాదవశాత్తు వాగులో పడి పశువుల కాపరి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిమన్యు తెలిపిన సమాచారం మేరకు పెద్దాపురం గ్రామానికి చెందిన చెరుకుమల్లి వెంకటేశ్వర్లు (41) వృత్తిరీత్యా పశువులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పశువులను గ్రామ సమీపంలోని మేతకు తీసుకెళ్లి మధ్యాహ్న సమయంలో నీటి కోసం ఏనుగు గడ్డ వాగుకు మలిపే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ఏనుగు గడ్డ వాగులో పడ్డాడు. గమనించిన స్థానికులు వెంకటేశ్వరరావును బయలకు తీసేందుకు యత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఏనుగు గడ్డ వాగు వద్దకు వచ్చి విగతజీవిగా పడి ఉన్న వెంకటేశ్వర్లును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అజిత్సింగ్నగర్, డాబాకొట్లు సెంటర్కు చెందిన చెరుకుపల్లి శివకృష్ణ(35) అవివాహితుడు. తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. అతను గవర్నర్పేటలోని ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 12 గంటలకు అతను టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వద్దకు చేరుకుని అక్కడ పార్సిల్ తీసుకున్నాడు. మళ్లీ దానిని వేరేచోట ఇచ్చేందుకు బాలాజీ హోటల్ వైపు నుంచి వన్వేలో హైవే మీదుగా బస్టాండ్ ఔట్గేట్ వైపునకు వెళ్తున్నాడు. బస్టాండ్ ఔట్గేట్ వద్దకు చేరుకుని ఈత్రీ వైపునకు వెళ్లేందుకు జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా, గుడివాడ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు బస్టాండ్ నుంచి గుడివాడకు వెళ్లే క్రమంలో ఔట్గేట్ వద్ద మలుపు తిరుగుతూ ఆ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను కిందపడిపోయి తీవ్రంగా గాయపడి రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


