ఔటర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
అఖిల భారత కిసాన్ సభ
ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
భూములిచ్చేది లేదంటూ పొన్నవరం క్రాస్ రోడ్డు వద్ద రైతుల ఆందోళన
బలవంతం చేస్తే ఆత్మహత్యలేనంటూ ఆగ్రహం
వీరులపాడు: ప్రభుత్వం జారీ చేసిన ఔటర్ రింగు రోడ్డు నోటిఫికేషన్ రద్దు చేయటంతో పాటు రైతులకు వ్యతిరేకంగా చేపడుతున్న బలవంత భూసేకరణను తక్షణమే నిలుపుదల చేయాలని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులకు చేపడుతున్న భూసేకరణను నిలుపుదల చేయాలని కోరుతూ పొన్నవరం క్రాస్ రోడ్డు వద్ద రైతులతో కలిసి గురువారం ఆయన ఆందోళన చేశారు. మా భూమి మా హక్కు అని, భూసేకరణను నిలుపుదల చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. ముందుగా భూములు కోల్పోతున్న రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రింగ్ రోడ్డుకు సేకరిస్తున్న భూములు సారవంతమైనవని, ఏడాదికి రెండు పంటలు పండే భూముల్లో రహదారులు వేయటం సమంజసం కాదన్నారు. పత్తి, మొక్కజొన్న, పసుపు తదితర వాణిజ్య పంటలకు కేంద్రంగా ఉన్న ప్రాంతంలో భూసేకరణ దుర్మార్గ చర్య అన్నారు.
21 రోజుల వ్యవధి.. అనుమానాలకు నాంది..
భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత అభ్యంతరాలను తెలుసుకునేందుకు రెండు నెలల సమయం ఇవ్వాల్సి ఉందని, కానీ కేవలం 21 రోజుల వ్యవధి మాత్రమే ఇవ్వటం అనుమానాలకు తావిస్తోందని విజూ కృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు జిల్లాల పరిధిలో 190 కి.మీ మేర నిర్మించనున్న రహదారికి మొదట 140 మీటర్ల వెడల్పు అని చెప్పి, ఇప్పుడు 250 మీటర్ల వెడల్పు రహదారికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ తక్కువ ధరకు ప్రభుత్వ భూములను కారు చౌకగా అప్పజెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీరాంజనేయులు, కోట కళ్యాణ్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


