ఈవీఎం గోదాముపై నిరంతర పర్యవేక్షణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధా రణ నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతోపాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదాము వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


