డొంకేశ్వర్ : ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కేవైసీ తప్పనిసరి చేయడంతో గ్రామాల్లో పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆధార్ అప్డేట్ లేకపోవడంతో రేషన్ దుకాణాల్లోని ఈ–పాస్ యంత్రాల్లో వారి వేలి ముద్రలు నమోదు కావడం లేదు. దీంతో ఆధార్ అప్డేషన్ కోసం తల్లిదండ్రులు వారి పిల్లలతో ఆధార్ కేంద్రాల్లో క్యూ కడుతున్నారు. మరో పక్క ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రేషన్ కేవైసీ పూర్తి చేసుకోవాలని గడువు విధించింది. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఓ ఆధార్ కేంద్రంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు బారులు తీరిన చిత్రాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఐదో టౌన్ పీఎస్ పరిధిలో ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. మంగళవారం నాగారం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు కంప్యూటర్, మానిటర్ తీసుకొని అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని గమనించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విశ్వజింత్, షేక్ ఆఫీజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈనెల 23న బ్రాహ్మణకాలనీలో మానిటర్, పలు కంప్యూటర్ల విభాగాలను, టేబుల్ ఫ్యాన్లను, 25న న్యాల్కల్ రోడ్డులో ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నారు. పోలీసులు నిందితుల ఇళ్లలో తనిఖీలు చేయగా వివిధ కంప్యూటర్లు, సీపీయూలు, టేబుల్ ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: ఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు. ఇంద్రపూర్ కాలనీకి చెందిన రమేశ్ ఫోన్లో మట్కా ఆడుతుండగా పట్టుకున్నామని అన్నారు. రమేశ్కు శాంతినగర్కు చెందిన షేక్అస్రాప్ మట్కా ఆడిస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రమేశ్ నుంచి రూ.5,070 నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్అర్బన్: నగరంలోని కోజాకాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు.
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు మంగళవారం అందజేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఫోన్ పోయిన బాధితులు వెంటనే పీఎస్లో, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని చేయాలని అన్నారు.
పోలింగ్ బూత్ల పరిశీలన
నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్తండాలో గల పోలింగ్ బూత్ను మంగళవారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకోల్తండాలో 1200 మంది ఓటర్లకు ఒకే బూత్ ఉందని, మరో పోలింగ్ బూత్ ఏర్పాటుకు నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో గల సదుపాయాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ సువర్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.


