‘అభయహస్తం’ డబ్బులేవి?
ఉమ్మడి జిల్లాలో 13,506 మంది
నివేదికను అందించాం
మోర్తాడ్ : స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు గా ఉన్న మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2017 లో రద్దు చేసింది. మహిళలు జమ చేసుకున్న ప్రీమి యం డబ్బులను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి నా ఇప్పటికీ చెల్లించలేదు.
2009లో పథకం ప్రారంభం
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కోసం 2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఐసీ అనుసంధానంతో అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలంతా పథకంలో చేరేందుకు అవకాశం కల్పించారు. పథకంలో చేరిన సభ్యులు 59 ఏళ్లు నిండేవరకు ఏడాదికి రూ. 365 చొప్పున చెల్లించేలా పథకాన్ని రూపొందించారు.
పథకంలో చేరిన వారికి అభయహస్తం బాండ్లను సైతం అందించారు. 60 ఏళ్లు నిండిన సభ్యులు వారు జీవించినంతకాలం నెలకు రూ. 500 చొప్పున పింఛన్ అందించేలా రూపకల్పన చేశారు. దురదృష్టవశాత్తు సభ్యురాలు మరణిస్తే సహజ మరణానికి రూ. 35వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 75వేలు నామినీకి చెల్లించేలా పథకాన్ని అమలు చేశారు.
అభయహస్తం పథకం కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 13,506 మంది సభ్యులుగా గుర్తించి వీరితో రూ. 3,685 చొప్పున జమ చేయించారు. ఇందులో 59 ఏళ్లు నిండిన వారికి రూ. 500 చొప్పున పింఛన్ అందించారు. అలాగే మరో 40 వేల మందిని సభ్యులు చేర్చుకున్నారు. జిల్లాలోని మహిళలకు సంబంధించి రూ.12,67,69,610 నగదు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. ఈ సొమ్ము సంబంధిత ఆర్జీదారులకు వాపసు చేయడానికి ఏడాదిన్నర క్రితం మహిళా సంఘాల ప్రతినిధులు అభయహస్తం సభ్యత్వ రుసుం చెల్లించిన మహిళల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ అభయహస్తం పథకాన్ని 2017లో నిలుపుదల చేశారు. నాటి నుంచి పింఛన్ల పంపిణీ రద్దు చేయడంతో పాటు పింఛన్ పొందడానికి అర్హత వయస్సు వచ్చిన వారి సొమ్మును బ్యాంకులోనే ఉంచారు. పథకంలో చేరిన మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా సభ్యుల సభ్యత్వ సొమ్మును వారి వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని సభ్యులు కోరుతున్నారు.
అభయహస్తం పథకం కింద సభ్యులుగా ఉన్న మహిళల వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో సమాచారం అందించాం. ఎంతో మందికి డబ్బులు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తేనే సభ్యులుగా ఉన్నవారి ఖాతాల్లో జమ అవుతాయి.
– తడకల శ్రీనివాస్, సీసీ, మోర్తాడ్
పథకం రద్దయినా అందని డబ్బులు
వివరాలు సేకరించినా చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యం
జిల్లాకు రావాల్సిన సొమ్ము
రూ.12.67 కోట్లు


