● ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతింటున్న పంటలు ● ఈసారైనా పర
లక్ష్మణచాంద: ఈ ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో 3,371 మంది రైతులు 4.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 5009 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వివిధ మండలాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. మరికొద్దిరోజుల్లో పంట చేతికి అందివస్తుందని అనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఏ గ్రామానికి వెళ్లి రైతును కదిలించినా వారి కళ్లల్లో ఆవేదన కనిపిస్తోంది.
బీమా లేకపోవడంతో...
ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో చేరలేదు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకంలో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు చేయలేదు. దీంతో ఇలా అకాల వర్షాలకు నష్టపోతున్న రైతులకు బీమా సౌకర్యం లేకపోవడంతో పరిహారం అందక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
గతంలో ప్రకటించినా...
ఈ వానాకాలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మా సాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకుంటామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అమలు కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.
గతంలో 13 వేల ఎకరాల్లో పంట నష్టం...
జిల్లాలో గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు నవంబర్ మాసంలో వచ్చిన మొంథా తుపాను కారణంగా 13 వేల ఎకరాల్లో వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, తదితర పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకూ పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారైనా...
జిల్లాలో ఇటీవల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు సోన్, లక్ష్మణచాంద, తానూర్, కుభీర్, భైంసా, ముధోల్, లోకేశ్వరం, మామడ మండలాల్లో 3,371 మంది రైతులకు చెందిన 4,850 ఎకరాల్లో మొక్కజొన్న, 58 మంది రైతులకు చెందిన 88 ఎకరాల్లో జొన్న, 40 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో శెనగ, 11 మంది రైతులకు చెందిన 9 ఎకరాల్లో గోధుమ పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈసారైనా ప్రభుత్వం స్పందించి పంటనష్ట పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
జిల్లా సమాచారం
పంటపేరు రైతుల సంఖ్య నష్టపోయినపంట
(ఎకరాల్లో)
మొక్కజొన్న 3,262 4,850
జొన్న 58 88
శెనగలు 40 62
గోధుమ 11 9
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
సోమవారం కురిసిన అకాల వర్షానికి కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు సర్వే చేపట్టి జిల్లా వ్యాప్తంగా 5009 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించాం. తదుపరి ప్రభుత్వం సూచనల మేరకు చర్యలు చేపడుతాం. – అంజిప్రసాద్, డీఏవో
ఈ చిత్రంలో నేల వాలిన మొక్క జొన్న పంట చూపుతున్న యువ రైతు లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామానికి చెందిన రెంక రాజు. గతేడాది కురిసిన వర్షాలకు రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట గోదావరి నది ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ఏడాది మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షాలకు పంటచేను పూర్తిగా నేలమట్టం కావడంతో ఆందోళన చెందుతున్నాడు.
● ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతింటున్న పంటలు ● ఈసారైనా పర


