ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్రూరల్: జిల్లాలో బుధవారం ఇంటర్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,076 మంది విద్యార్థులకు గానూ 6,772 మంది హాజరుకాగా 304 మంది గైర్హాజరయ్యారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా హాజరైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. తొలిరోజు జిల్లాలో 95.70 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గురువారం జరుగనున్న ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6,473 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో గల ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్ష గదులను సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాదవ్ పరశురాం, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్ పరీక్షలు ప్రారంభం


