● నిర్మలమ్మ ఈసారైనా కరుణిస్తారా? ● పెండింగ్లోనే ఈఎస్ఐ
నిర్మల్: ఎక్కడ నుంచి ఎక్కడి దాకా రైలు వేయాలి, ఈ మార్గంలో ఎన్ని బ్రిడ్జీలు కట్టాలి, ఎన్ని సొరంగాలు తవ్వాలి, మొత్తం ఎంతవరకు ఖర్చవుతుంది.. ఇదిగో ఇలాంటి లెక్కలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే నాలుగైదుసార్లు సర్వేలూ చేశారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కు రైలు వెళ్లినట్లు ఫైళ్లు కదులుతున్నాయి కానీ.. జిల్లాకు మాత్రం రైల్వేలైన్ రావడం లేదు. ప్రతీఏడాది బడ్జెట్లో నిధులకు పచ్చజెండా ఊపుతారని ఆశలు పెట్టుకుంటుంటే, కేంద్రం మొండిచేయే చూపుతోంది. గతంతో పోలిస్తే.. ఈసారి బడ్జెట్పై జిల్లావాసుల్లో బాగానే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్కు సంబంధించి డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) పూర్తయింది. ఈ లైన్ వెళ్లే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలూ బీజేపీవాళ్లే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు రైల్వేమంత్రిని, రైల్వేబోర్డు చైర్మన్నూ కలిశారు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో జిల్లామీదుగా రైలుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ నిధుల జెండా ఊపుతారని భావిస్తున్నారు. రైల్వేలైన్తోపాటు జిల్లా అభివృద్ధికి మరింత సహకరించాలన్న కోరుతున్నారు.
ఈసారి నవ్వులాట కావొద్దు..
దశాబ్దాలుగా జిల్లావాసులు రైలు కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ లైన్ కాకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ వేస్తే సరిపోతుందన్న డిమాండ్ ఉంది. దీనిపై రెండు నెలల క్రితం పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆదిలాబాద్ లోక్సభ ఎంపీ నగేశ్తోపాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, జిల్లావాసి సిర్గాపూర్ నిరంజన్రెడ్డి సైతం గొంతెత్తారు.
యూనివర్సిటీ ఏర్పాటు దిశగా..
‘చదువులతల్లి కొలువైన నిర్మల్ జిల్లాలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం..’ అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం కూ డా యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల కేటా యింపులు చేయాల్సిన అవసరం ఉంది. చదువులమ్మ కొలువైనా ఇప్పటికీ జిల్లా విద్యారంగంలో వెనుకబడే ఉంది. పీజీ, ఇంజినీరింగ్ చదవడానికి హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిన దుస్థితి. కేంద్రం నవోదయ, సైనిక్ విద్యాలయాలు జిల్లాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. బాసరకు కేటాయించిన కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి తీసుకురావాలి.
పురావస్తు.. పట్టేదెప్పుడు..!?
చారిత్రక నేపథ్యమున్న జిల్లాలో వందల ఏళ్ల కింద టి కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ కబ్జాలు, ఆక్రమణలతో రూపుకోల్పోతున్నాయి. పట్టించుకోవాల్సిన పురావస్తుశాఖ అసలు ఉందా.. పనిచేస్తుందా..!? అన్నట్లుగా మారింది. కేంద్రం ఆధీనంలోని ఈ శాఖకు ఇప్పటికీ సరిపడా సిబ్బంది లేకపోవడం జిల్లాకూ శాపంగా మారింది. వీటితోపాటు జి ల్లాలో ఇథనాల్, ఆయిల్పామ్లాగా కాకుండా ప్ర జామోదంతో కొనసాగే పరిశ్రమలను కేటాయించా ల్సిన అవసరముంది. నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, భైంసాలో డిస్పెన్సరీని కేటాయిస్తామని చెప్పి, దశాబ్దం గడుస్తోంది. ఈసారైనా వీటిని కేటాయించాలి.
ఈ బడ్జెట్లోనే కేటాయించాలి..
జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి ఈసారి బడ్జెట్లోనే నిధులు కేటాయించి, పనులను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నాం. ఇప్పటికే ఈ లైన్ నిర్మాణంలో చాలా ఆలస్యమైంది. ఇకనైనా వేగవంతం చేయాలి.
– ఎంసీ లింగన్న, రైల్వేలైన్ సాధన కమిటీ చైర్మన్


