వడ్ల కొనుగోళ్లకు కొత్త సాంకేతికత
లక్ష్మణచాంద: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాల గుర్తింపునకు ఇప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా 317 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, ప్రతీ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచింది.
గ్రేయిన్ క్యాలీఫర్..
ధాన్యాన్ని రకాల వారీగా గుర్తించడంలో గ్రేయిన్ క్యాలీఫర్ కీలకపాత్ర పోషిస్తోంది. ధాన్యంలో ఉన్న బియ్యం గింజ పొడవు, వెడల్పు వంటి ప్రమాణా లను పరికరం ద్వారా లెక్కించి సన్న, దొడ్డు రకా లని తేలుస్తున్నారు. వరి సంచులపై ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గుర్తుల ద్వారా రైతులకు తెలిసేలా చేస్తున్నారు. రైతులు తెచ్చిన సన్న రకాలను ప్యాడీ పాస్కల్తో పిడికెడు ధాన్యం పోసి తిప్పితే ధాన్యంపై గల పొట్టు ఊడి పోతుంది. అప్పుడు బియ్యం గింజ బయటకు వస్తుంది. పొట్టు తీసిన బియ్యం గింజను గ్రేయిన్ క్యాలీఫర్లో వేస్తారు. గింజ పొడవు, వెడల్పు లెక్కించి వచ్చిన శాతం ఆధారంగా వాటిని సన్న రకాలుగా గుర్తిస్తున్నారు.
కౌలు రైతులకు డిజిటల్ అనుమతి
కౌలు రైతుల కోసం స్వచ్ఛమైన అనుమతి విధానం ప్రవేశపెట్టారు. యజమాని–రైతు ఆధార్ల అనుసంధానం, ఓటీపీ ధ్రువీకరణ వంటి మునుపటి దశలను పూర్తి చేసినప్పుడే కొనుగోళ్లకు వీలు ఉంటుంది. ఇది అత్యధిక భద్రతతోపాటు నేరుగా రైతుఖాతాలోనే చెల్లింపు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన డిజిటల్ ఏర్పాటుగా నిలుస్తోంది.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్కు 1.69 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రకాల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచి, రైతులకు అన్ని విధాలుగా మేలును అందించటానికి నూతన వేదిక సిద్ధమైంది.


