
‘భూభారతి’తో సమస్యలకు పరిష్కారం
లక్ష్మణచాంద/సారంగాపూర్/దిలావర్పూర్: భూభారతి చట్టం అమలుతో మండలస్థాయిలోనే ప్రజల భూసమస్యల పరిష్కారం అవుతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భూభారతి చట్టంపై లక్ష్మణచాంద, సారంగాపూర్ మండల కేంద్రాల్లో, దిలావర్పూర్ మండలం బన్సపల్లి రైతువేదికల్లో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. భూభారతి చట్టం అమలు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. రైతులకు వారి భూములపై సమగ్రమైన హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలి పారు. గ్రామ పాలన అధికారులను నియమించి ధరణిలో ఉత్పన్నమైన భూసమస్యలను సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించి వారికి హక్కులను కల్పించేందు కు భూభారతిలో అవకాశం ఉందని పేర్కొన్నా రు. సమస్యలపై దరఖాస్తు చేసిన తర్వాత నిర్ణీత గడువులోపే పరిష్కరించాల్సి ఉంటుందని తెలి పారు. చాలా వరకు సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. క్రయవిక్రయాల ద్వారా పట్టా మార్పిడి, వారసత్వ పట్టా మార్పిడి వంటి అనేక పనులు సులభంగా చేసుకోవచ్చన్నారు. సాదాబైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రి య సరళతరం చేయడంతో అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ గ్రామంలో వ్యవసాయ భూముల వివరాలతో రికార్డులను సిద్ధం చేసి గ్రామపంచాయతీల్లో ప్రదర్శించడంతోపాటు ఆధార్ తరహాలో భూమికి భూదార్ నంబర్ కేటాయించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సదస్సులో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్, డీఎంహెచ్వో రాజేందర్, తహసీల్దార్లు జానకి, శ్రీదేవి,అజీజ్ ఆహ్మద్, ఎంపీడీవోలు రాధారాథోడ్, లక్ష్మీకాంత్రావు, అరుణారా ణి, మండల ప్రత్యేక అధికారులు మోహన్సింగ్, బాలిక్ అహ్మద్, శంకర్, ఏఎంసీ చైర్మన్ భీమ్రెడ్డి, వైస్చైర్మన్ ఈటల శ్రీనివాస్, డీసీసీబీ వైస్చైర్మన్ రఘునందన్, మండల వ్యవసాయ అధికారి వసంత్రావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
లక్ష్మణచాంద, సారంగాపూర్లో అవగాహన సదస్సులు