
బెంగళూరు: ఐపీఎల్ టైటిల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలిచిన సందర్బంలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో తొక్కిసలాట(Bengaluru Stampede) జరిగి 11 మంది మృత్యువాత పడటంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న డీకే శివకుమార్.. దీనికి తమ ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేశారు.
‘ఈ సంఘటనను రాష్టం అంతా చూసిందని, ఇది చాలా మనోవేదనకు గురి చేసే సంఘటనని, తొక్కిసలాట జరగడం పదకొండు మంది చనిపోవడం అత్యంత బాధాకరం.
మేము ప్రజలకు క్షమాపణలు చెప్పడం తప్పిస్తే ప్రస్తుతం ఏమీ చేయలేము. ఆ విషాద ఘటన గురించి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంఇ. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో అంతా చూశారు. దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఇక్కడ జరిగింది వేరు.. రాజకీయం చేయాలనుకోవడం లేదు’ అని డీకే శివకుమార్ జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తొక్కిసలాటలో చనిపోయింది అంతా కూడా యువకులే. వారి జీవితాలు ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది.
అయితే గవర్నమెంట్ వైఫల్యంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని మీరు బావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇక్కడ ఎవర్ని బాధ్యుల్ని చేయాలని అనుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై బీజేపీ అడుగుతున్న ప్రశ్నలకు తాము పారిపోవాలని అనుకోవడం లేదన్నారు డీకే శివకుమార్. ఈ ఘటనపై వారికి కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు.
ఇక ఈ ఈవెంట్కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ కమిషనర్ చెబుతుండగా, ఆర్సీబీ ఒక స్టేట్మెంట్తో బయటకు రావడంపై ప్రశ్నించగా, ఇప్పుడు దానిపై మాట్లాడదలుచుకోలేదన్నారు తాను కేవలం ఎంతో ముఖ్యమైన ప్రజల జీవితాల గురించే ఆలోచిస్తున్నానన్నారు డీకే శివకుమార్.
బెంగళూరు పోలీస్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు
తొక్కిసలాట ఘటనపై బెంగళూరు సీపీపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. సీపీతో పాటు అడిషనల్ సీపీ, ఏసీపీ, డీసీపీలను సైతం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు సీఐడీని ఆదేశించింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.