రోజ్‌గార్‌ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు | Union minister Jitendra Singh says 147000 inducted through Rozgar Melas | Sakshi
Sakshi News home page

రోజ్‌గార్‌ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు

Dec 16 2022 6:06 AM | Updated on Dec 16 2022 6:06 AM

Union minister Jitendra Singh says 147000 inducted through Rozgar Melas - Sakshi

న్యూఢిల్లీ: రోజ్‌గార్‌ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు.

2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్‌ పాపులేషన్‌ రేషన్‌–డబ్లూపీఆర్‌) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్‌ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్‌ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement