ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం

Twitter seeking to undermine Indias legal system - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విటర్‌ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విటర్ పాఠాలు నేర్పుతోందని కేంద్రం మండిపడింది. ట్విటర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపించింది. నిబంధనల గురించి పాఠాలు నేర్పేందుకు ట్విటర్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్‌ చూస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. కాగా, ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్‌ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికి చిలికి పెను తుఫానులా మారింది. మరోవైపు ‘కాంగ్రెస్ టూల్ కిట్’ వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం పప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది.

చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలపై స్పందించిన సుందర్‌ పిచాయ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top