చెన్నై: తమిళనాట టీవీకే పార్టీ సంచలనం రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ.. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ దూసుకుపోతోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కు నెట్టి విజయ్ పార్టీ ముందంజలో ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎవరి మద్దతు లేకుండా సొంతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ (Felix Gerald) చెప్పారు.
తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తామే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో డీఎంకే శకం ముగిసిందని అన్నారు. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకున్నారని చెప్పారు. తమిళనాడు మొత్తం మార్పు కోరుకుందని ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. ముఖ్యంగా యువత, మహిళలు తమ పార్టీకి అండగా నిలిచారని అన్నారు.
తమ నాయకుడు విజయ్పై ప్రజలు విశ్వాసం ఉంచారని, అందుకే ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామన్నారు. దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని అభిప్రాయపడ్డారు. వంశపారంపర్య పాలనకు ముగింపు పలికారని, ఇది డీఎంకేకు ముగింపు అన్నారు. తమకు అండగా నిలిచిన తమిళ ప్రజలకు తమ పార్టీ తరపున ఫెలిక్స్ గెరాల్డ్ ధన్యవాదాలుత తెలిపారు.


