బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్
చెన్నై: టీవీకే అధినేత ప్రజాదరణ గల నటుడు మాత్రమేనని, పెద్ద రాజకీయ నాయకుడు కాదని బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఆమె పీటీఐతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు మార్పునకు ఓటేశారని అన్నారు. డీఎంకే పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మైలాపూర్లో తాను కూడా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఎలా ఉండబోతోందని తమిళిసై సౌందరరాజ్ను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ''విజయ్ ప్రజాదరణ కలిగిన నటుడు, పాపులర్ పొలిటిషియన్ కాదు. ఆయన స్టార్ ఇమేజ్ కారణంగా ఎన్నికల్లో కొంత ప్రభావం కచ్చితంగా ఉంటుంది. పెద్దగా ప్రభావం ఉండదు. విజయ్ పార్టీ ఉన్నప్పటికీ విజయం మాత్రం ఎన్డీఏదేన''ని సమాధానం ఇచ్చారు.
ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ
తమిళనాడు ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ప్రజలు మార్పు కోసమే ఓటు వేశారు. డీఎంకేకు ప్రజలు తగిన విధంగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. డీఎంకే నేతలు ప్రజలపై కాకుండా కేవలం తమ రాజకీయ లబ్ధిపైనే దృష్టి పెట్టారు. దీంతో ప్రజలు ఎన్నికల్లో డీఎంకేను వ్యతిరేకించి, ఎన్డీఏను ఆదరించారు. ఎడప్పాడి కె పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఈ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి హాజరవుతారని తమిళిసై అన్నారు.
కాగా, ప్రస్తుతం అందుతున్న ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల కంటే టీవీకే ముందంజలో ఉంది. దీంతో టీఎంకే పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతారణం నెలకొంది.


