పట్నా: కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ గాంధీకి లేదని లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు, జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ వాద్రాను ఇండియా కూటమి ఫేస్గా ఆయన వర్ణించారు. ప్రియాంక మాత్రమే సమర్థవంతంగా విపక్ష కూటమిని నడపగలరని అభిప్రాయపడ్డారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చారు.
''కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిని ప్రియాంక గాంధీ మాత్రమే నడపగలరు. ఆమె ఇందిరా గాంధీ లాంటివారు. యాత్రకు వెళ్లడం, బుల్లెట్పై కూర్చోవడం ద్వారా రాహుల్ గాంధీ కూటమిని నడపలేరు. బిహార్ నుంచి నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఉద్దేశ్యం ఏమిటి?" అని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ద్వారా నితీశ్ కుమార్ రాజీపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో తేజ్ ప్రతాప్ స్పందించారు. ''రాహుల్ గాంధీ ఇప్పుడు నితీశ్ కుమార్ గురించి మాట్లాడుతున్నారు. నితీశ్ తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన (రాహుల్ గాంధీ) మరో రాష్ట్రంలో ఉన్నారు. అలాంటప్పుడు బిహార్ సీటు విషయంలో ఎందుకు అత్యాశ పడుతున్నారు?” అని తేజ్ ప్రతాప్ యాదవ్ నిలదీశారు.
యాదవ్పై రాజ్ ఫైర్
తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదిత్ రాజ్ స్పందించారు. లాలూ కుమారుడికి రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోరని అన్నారు. అనవసరపు మాటలు కట్టిపెట్టి తన సొంత పనిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, ఇండియా కూటమిని నడిపే సత్తా రాహుల్కు లేదని గతంలోనూ పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.
చదవండి: హమ్మయ్య! అమిషాను నవ్వించాం.. రాహుల్ సరదా వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''బిహార్ తరహా రాజకీయాలు తమిళనాట కుదరవని అన్నారు. కొద్ది రోజుల క్రితం బిహార్లో ఏం జరిగిందో చూడండి. బిహార్ ముఖ్యమంత్రిని తొలగించి బీజేపీ నాయకుడిని సీఎం సీటులో కూర్చొబెట్టారు. ఎందుకంటే సీఎం రాజీపడ్డారు. పదవి నుంచి ఎందుకు తొలగించారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మౌనంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. బీజేపీ ఆయనను కంట్రోల్ చేసింది. ఇదే విధానం తమిళనాడులో అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. కాషాయ పార్టీ కలలను ఇండియా కూటమి భగ్నం చేస్తుంద''ని అన్నారు.


