న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా మధ్య రగడ మరింత ముదురుతోంది. తనపై పార్టీ నాయకత్వం చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ఆయన కొట్టిపారేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికే పార్లమెంట్కు వెళ్తున్నాను తప్ప గొడవలు సృష్టించడానికి కాదని తేల్చిచెప్పారు. ఆప్ అబద్ధాల అసలు రంగు కచ్చితంగా బయటపడుతుందన్నారు. ‘ధురంధర్’చిత్రంలోని డైలాన్ను ప్రస్తావిస్తూ.. గాయపడ్డాను కాబట్టి మరింత దృఢంగా మారానని స్పష్టంచేశారు.
ఈ మేరకు రాఘవ్ చద్ధా శనివారం ‘మూడు ఆరోపణలు, సున్నా నిజాలు’పేరిట ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం పట్ల రాఘవ్ చద్ధా సానుకూలంగా ఉంటున్నారని ఆప్ నాయకత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీనిపై రాఘవ్ చద్ధా అభ్యంతరం వ్యక్తంచేశారు. తన గొంతు నొక్కగలరు కానీ ఓడించలేరని ఆప్ నాయకత్వానికి తేల్చిచెప్పారు.


