రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’గా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించనున్నట్లు సమాచారం.
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధానమంత్రి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది.


