రూ.8,452 కోట్ల పీఎంకేర్స్‌.. బడుల కోసం మళ్లించాలా? | PM CARES Fund, CJP Questions Why ₹8,452 Crore Corpus Isn’t Being Used For Schools, Read Full For More Details | Sakshi
Sakshi News home page

రూ.8,452 కోట్ల పీఎంకేర్స్‌.. బడుల కోసం మళ్లించాలా?

Aug 20 2026 8:29 AM | Updated on Aug 20 2026 9:13 AM

PM CARES Fund: CJP Demand Should Corpus Be Redirected to Schools

కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్‌ ఫండ్‌ మరోసారి చర్చలోకి వచ్చింది. ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నట్లు తాజా ఆడిట్‌ వివరాలు వెల్లడించడంతో.. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలనే అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే చేసిన డిమాండ్‌ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

యువత తనకు అండగా నిలిస్తేనే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు అవసరమైన అవకాశాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దేశ భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగం, ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి పీఎంకేర్స్‌ నిధులను వినియోగించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. 

పీఎంకేర్స్‌ నిధులు ఎంత పెరిగాయి?.. 2020లో కోవిడ్‌ సంక్షోభ సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్‌ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తాజా ఆడిట్‌ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి.

తాజా ఆడిట్‌ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎంకేర్స్‌ ఫండ్‌ నుంచి మొత్తం చెల్లింపులు కేవలం రూ.87.85 లక్షలుగా ఉన్నాయి. ఇందులో రూ.87.84 లక్షలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించే పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ కోసం ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తం బ్యాంకు తదితర చిన్న ఖర్చులకు వెళ్లినట్లు వివరాలు వెల్లడించాయి.

అంతకుముందు ఏడాది రూ.7,173 కోట్లుగా ఉన్న నిల్వ.. ఏడాదిలో దాదాపు 17.8 శాతం పెరిగింది. ఇందులో సుమారు రూ.7,846 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే నిధులు పెరిగినప్పటికీ.. విరాళాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. 2024-25లో దేశీయ విరాళాలు రూ.479 కోట్లకు పడిపోయాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఫండ్‌కు ప్రధాన ఆదాయంగా మారింది.

సీజేపీ డిమాండ్‌ ఏంటి?
పీఎంకేర్స్‌లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నప్పటికీ.. దేశంలోని గ్రామీణ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ అధినేత అభిజిత్‌ దీప్కే ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు, తరగతి గదుల్లో బెంచీలు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ సీజేపీ ఇప్పటికే ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ బడుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తూ.. పాఠశాలల పరిస్థితిని పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సీజేపీ చెబుతోంది.

‘‘ఒకవైపు పాఠశాలలకు నిధుల కొరత ఉందని చెబుతున్నారు.. మరోవైపు రూ.8,500 కోట్లు పీఎంకేర్స్‌లో ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఈ డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు వినియోగించకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక మోడల్‌ హైటెక్‌ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని లెక్కిస్తే.. ఈ మొత్తంతో వెయ్యికి పైగా ఆధునిక పాఠశాలలు నిర్మించవచ్చని ఆయన చెప్పారు.

పీఎంకేర్స్‌పై వచ్చిన ఆరోపణలు ఏంటి?
పీఎంకేర్స్‌ ఏర్పాటు అయినప్పటి నుంచే ఈ ఫండ్‌ పారదర్శకతపై ప్రతిపక్షాలు, కొన్ని పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై విమర్శలు వచ్చాయి:

ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావడం లేదు?
పీఎంకేర్స్‌ నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నప్పటికీ.. ఇది సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిధుల సేకరణ, ఖర్చుల వివరాలపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు వచ్చాయి.

కాగ్‌ ఆడిట్‌ ఎందుకు లేదు?
ప్రతిపక్షాలు పీఎంకేర్స్‌ను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) ఆడిట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా స్వచ్ఛంద విరాళాలతో నడిచే ట్రస్ట్‌ కావడంతో కాగ్‌ పరిధిలోకి రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిధులు ఎందుకు ఎక్కువగా నిల్వ ఉన్నాయి?
రూ.8,452 కోట్లలో ఎక్కువ మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం ఏర్పాటైన ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తం వినియోగం లేకుండా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

‘‘అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఉండగా.. వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?’’ అనేది చాలా మంది అడిగేది. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. పీఎంకేర్స్‌ అనేది అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద విరాళాల ట్రస్ట్‌ అని, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉండాలని చెబుతోంది.

ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి?
పీఎంకేర్స్‌ ఒక స్వతంత్ర ట్రస్ట్‌ అని, దీనికి ఎలాంటి బడ్జెట్‌ నిధులు కేటాయించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఇది నడుస్తుందని పేర్కొంటున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, వెంటిలేటర్ల కొనుగోలు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు నిధులను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే..

సీజేపీ డిమాండ్‌కు ప్రజల్లో కొంత మద్దతు కనిపిస్తున్నప్పటికీ.. ఆచరణలో ఇది అంత సులభం కాదన్నది ప్రభుత్వ వర్గాల మాట. పీఎంకేర్స్‌ ఏర్పాటు చేసిన లక్ష్యాలు అత్యవసర సహాయానికి సంబంధించినవి కావడంతో.. నిధులను విద్యా రంగానికి మళ్లించాలంటే ట్రస్ట్‌ నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో పాఠశాలల మౌలిక వసతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి భారీ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో వినియోగించాలనే డిమాండ్‌ మాత్రం కొనసాగుతోంది.

అసలు ప్రశ్న ఏంటి?
పీఎంకేర్స్‌ విషయంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు.. విపత్తుల సమయంలో వెంటనే ఉపయోగించుకునేలా భారీ నిధి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రజల విరాళాలతో ఏర్పడిన వేల కోట్ల నిధులు మరింత పారదర్శకంగా ఉండాలని, అవసరమైన రంగాలకు ఉపయోగపడాలని విమర్శకులు కోరుతున్నారు.

రూ.8,452 కోట్ల పీఎంకేర్స్‌ నిధి.. కేవలం ఓ ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. అత్యవసర నిధి లక్ష్యం, ప్రజా ప్రయోజనం, పారదర్శకత మధ్య సమతుల్యతపై జరుగుతున్న పెద్ద చర్చకు ఇది కేంద్ర బిందువుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement