పెట్రోల్, డీజిల్.. లీటరుపై రూ.3 వడ్డన.. సీఎన్జీపైనా కిలోకు రూ.2 భారం
రెండేళ్ల తర్వాత మళ్లీ పెరిగిన ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన ముడిచమురు
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడిపై మళ్లీ ధరల పిడుగు పడింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై ఏకంగా రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు శుక్ర వా రం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరల్లో ఈ స్థాయిలో పెంపు జరగడం ఇదే తొలిసారి. మార్చి 2024లో ఎన్నికల ముందు లీటరుకు రూ.2 మేర రేట్లను తగ్గించిన కేంద్రం.. ఇప్పుడు ఒకేసారి రూ.3 వడ్డించడం గమనార్హం. పెట్రోల్, డీజిల్తోపాటు సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. కిలో సీఎన్జీపై రూ.2 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.79.09కి చేరింది. ఈ పెంపు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో పాటు సొంత వాహనదారులకు భారంగా పరిణమించింది.

ధరలు ఎందుకు పెరిగాయి?: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులే ఈ పెంపునకు ప్రధాన కారణం. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల నుంచి ఏకంగా 100 డాలర్లకు పైగా చేరింది. దీంతో చమురు సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ సంస్థలు నెలకు రూ.30,000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ వంటి పొరుగు దేశాల్లో ఎప్పుడో ఇంధన ధరలు 15 శాతం నుంచి 20 శాతం మేర పెరిగినా.. భారత్లో మాత్రం ఆ భారాన్ని ఇప్పటివరకు వినియోగదారులపై మోపలేదు.


