‘ఆ తీర‍్పు అత్యంత ప‍్రమాదకరం’.. 17 విపక్ష పార్టీల ఆందోళన! | Opposition Dubbed As Dangerous On Supreme Court Nod To PMLA Act | Sakshi
Sakshi News home page

‘పీఎంఎల్‌ఏ చట్టంపై తీర్పు ప్రమాదకరం’.. 17 విపక్ష పార్టీల ఆందోళన!

Aug 3 2022 4:27 PM | Updated on Aug 3 2022 4:27 PM

Opposition Dubbed As Dangerous On Supreme Court Nod To PMLA Act - Sakshi

మనీలాండరింగ్ చట్టంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అత్యంత ప్రమాదకరమైన తీర్పుగా అభివర్ణించాయి విపక్ష పార్టీలు.

న్యూఢిల్లీ: పీఎంఎల్‌ఏ చట్టం 2002కు 2019లో సవరణలు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించటాన్ని ఇటీవల సమర్థించింది సుప్రీం కోర్టు. ఈడీ అరెస్టులు, సోదాలు సరైనవేనని, దర్యాప్తు అధికారులు పోలీసులు కాదని స్పష్టం చేసింది. అయితే.. సుప్రీం కోర్టు తీర్పును అత్యంత ప్రమాదకరమైన తీర్పుగా అభివర్ణించాయి విపక్ష పార్టీలు. సుమారు 17 విపక్ష పార్టీలు సుప్రీం కోర్టు తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీర్ఘకాలం పాటు దాని ప్రభావం ఉంటుందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరాయి. ‘ప్రమాదకరమైన తీర్పు స్వల్ప కాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగపరమైన నిబంధనలు అమలులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్‌ వాదీ పార్టీ, ఆర్‌జేడీ వంటి ప్రధాన పార్టీలు సంతకాలు చేశాయి. 

రాజకీయ ప్రతీకారంతో చట్టాన్ని తప్పుదోవలో వాడుకుంటున్నారని ఇప్పటికే పలు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా.. సుప్రీం కోర్టు తీర్పుపై పునఃసమీక్షించాలని కోరనున్నట్లు పేర్కొన్నాయి. ఈ చట్టంలో చాలా తక్కువ మంది దోషులుగా తేలారని తెలిపాయి. 8 ఏళ్ల మోదీ పాలనలో ఈడీ రైడ్స్‌ 26 రెట్లు పెరిగాయి. 3,010 మనీలాండరింగ్‌ కేసులు నమోదు కాగా.. అందులో 23 మంది మాత్రమే దోషులుగా తేలారు. 112 సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పార్లమెంట్‌లో మనీలాండరింగ్‌ చట్ట సవరణ చేసిన విధానాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మనీ బిల్‌గా ప్రవేశపెట్టిన ఫైనాన్స్‌ చట్టం కింద వాటిని ఆమోదించారని పేర్కొన్నాయి. మనీ బిల్లు తప్పనిసరిగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌, ట్యాక్స్‌ల నుంచి నగదు కేటాయింపులకు వర్తించాలని, కానీ, ఇతర అంశాల్లో చట్టాలు చేసేందుకు ఉపయోగించకూడదని పేర్కొన్నాయి. సవరణలు చేసేందుకు ఆర్థిక చట్టాన్ని ఉపయోగించే విధానం రాజ్యాంగ బద్ధతను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నాయి.

ఇదీ చదవండి:  Yes Bank DHFL Scam: ముంబై బిల్డర్స్‌కు చెందిన రూ.415 కోట్ల ఆస్తులు సీజ్‌!

Advertisement
 
Advertisement
Advertisement