స్కూల్‌లో కంప్యూటర్లు చోరీ.. బ్లాక్‌బోర్డ్‌పై దొంగ రాసింది చూసి కంగుతున్న టీచర్లు

Odisha: Thieves Steal Computers In School, Its Me Dhoom 4 On Blackboard - Sakshi

భువనేశ్వర్‌: సినిమాలు ప్రజలపై ప్రభావాన్ని చూపుతాయి అంటుంటారు. ముఖ్యంగా యువత, పిల్లల మీద. అందీ మంచిగానూ అయి ఉండొచ్చు లేదా చెడు ప్రభావం అయినా కావొచ్చు. మొదట్లో ఏదో కాలక్షేపం కోసం చూసే సినిమాలు రానురానూ మనుషులపై భారీ ఎఫెక్ట్‌ను చూపుతున్నాయి. సినిమాల్లో హీరోలాగా రెడీ అవ్వడం, అతని అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవడం, హీరోయిజం చూపించడం వంటి వాటిని ఎక్కువగా అనుకరిస్తుంటారు. సినిమాలు చూసి ఇంకా రెచ్చిపోయి కొత్త కొత్త పద్దతుల్లో దొంగతనాలు చేయడం నేర్చుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. 

ఓ బాలీవుడ్‌ సినిమా నిజ జీవితంలో నేరం చేసేలా ప్రేరేపించింది. ఓడిశాలోని ఓ పాఠశాలలో ధూమ్‌ సినిమా స్పూర్తితో చోరి జరిగింది. బరంగ్‌పూర్‌లోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కంప్యూటర్లతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఓ అంగతకుడు దొంగిలించాడు. అంతటితో ఆగకుండా క్లాస్‌లోని బ్లాక్‌ బోర్డుపై ఇది నేను, ధూమ్‌4 అని రాసి వెళ్లాడు. శనివారం ఉదయం స్కూల్‌కు వచ్చిన అటెండర్‌.. మెయిన్‌ గేట్‌ తాళం పగలకొట్టి ఉండటంతో విషయాన్ని ప్రిన్సిపల్‌కు సమాచారాన్ని అందించాడు. హుటాహుటిన పాఠశాల లోపలికి వెళ్లి చూడగా.. కంప్యూటర్లు, ప్రింటర్, ఫోటోకాపియర్, సౌండ్ బాక్స్ తప్పిపోయినట్లు గుర్తించారు.

బ్లాక్‌బోర్డ్‌పై రాసి ఉన్న ధూమ్ 4 మేము త్వరలోనే తిరిగి వస్తామని రాసి ఉండటాన్ని చూసి కంగుతున్నారు. అలాగే ‘మీకు వీలైతే మమ్మల్ని పట్టుకోండి’ అని కూడా సవాలు విసిరాడు. చోరీపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాతిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 'గోట గో హోమ్‌' అంటూ పార్లమెంట్‌లో నినాదాలు... వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top