కర్ణాటక: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు..
కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజనతో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది.
సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు.



