రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్‌ యాత్రికులు మృతి | Nepali Pilgrims Returning From Maha Kumbh Mela Died In Road Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్‌ యాత్రికులు మృతి

Feb 2 2025 9:56 AM | Updated on Feb 2 2025 10:02 AM

Nepali Pilgrims Returning From Maha Kumbh Died Road Accident

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని మధుబని నాలుగు లేన్‌ల రోడ్డులో చోటుచేసుకుంది.

బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే  మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్‌కేఎంసీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్‌లోని మొహతారికి చెందిన కొందరు  ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్‌లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్‌ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ  ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్‌లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్‌ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్‌లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి

Advertisement
 
Advertisement
Advertisement