పాక్‌, దుబాయ్‌కు భారతీయుల అక్రమ రవాణా.. ఆలయంలో సంచలన లేఖ.. | Mysterious Letter In Haryana Hisar Shiv Temple Points At Trafficking Of 100 Persons To Pakistan And Dubai | Sakshi
Sakshi News home page

పాక్‌, దుబాయ్‌కు భారతీయుల అక్రమ రవాణా.. ఆలయంలో సంచలన లేఖ..

Jun 1 2025 12:34 PM | Updated on Jun 1 2025 1:51 PM

Mysterious Letter In Haryana Hisar Shiv Temple

ఛండీగఢ్‌: హర్యానాలోని ఓ శివాలయంలో దొరికిన సీక్రెట్‌ లేఖ సంచలనంగా మారింది. సదరు లేఖలో​ దాదాపు 100 మంది కిడ్నాప్‌ చేసినట్టు రాసి పెట్టి ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. దానిలోని విషయాలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖలో హిస్సార్‌కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారు.

వివరాల ప్రకారం.. హర్యానా హిస్సార్‌లోని రెడ్ స్క్వేర్ మార్కెట్‌లో ఉన్న శివాలయంలో పూజ చేసేందుకు శనివారం ఉదయం పూజరి సురేష్‌ గుడికి వెళ్లారు. ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు గోధుమ రంగు కవరులో ఒక లేఖ కనిపించింది. వెంటనే సురేష్‌.. దానిని తెరిచి చూశాడు. అందులో ఉన్న మ్యాటర్‌ చదవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఇక, ఆ లేఖపై తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చిరునామా ఉంది. దీంతో పూజారి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అనంతరం, హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. దానిలోని విషయాలను పరిశీలించారు. హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి దాదాపు వంద మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్తాన్‌కు విక్రయించినట్లు లేఖలో ఉంది. దీంతో, షాకైన పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

2018 నుంచే అక్రమ రవాణా..
లేఖ ప్రకారం.. మేము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించాం. నేను నా పేరును వెల్లడించను. ఫతేహాబాద్‌కు చెందిన ఒక కుటుంబం మాకు సహాయం చేసేది. వారు లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారు. హిస్సార్‌కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్‌ వాసి అమర్​నాథ్, ఎల్లనాబాద్‌కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, గంగానగర్​కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్​కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్​పుర్​కు చెందిన నరేష్‌​ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని కూడా చెప్పారు. మహిళా ముఠా నాయకురాలు పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని బెదిరిస్తోందన్నారు. ఆమె తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరిస్తోందని, అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.

సుమిత్‌ ఎవరు?. 
గుర్తు తెలియని వ్యక్తి రాసిన లేఖలో హిస్సార్​కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్ లో సుమిత్ అనే పేరు ఉన్న నాలుగైదు మంది కనిపించకుండా పోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్ కు చెందిన కుటుంబం కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.

పోలీసుల తనిఖీలు..
పాకిస్థాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హర్యానా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధ్రువీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement