న్యూఢిల్లీ: కేంద్ర సంస్థ దర్యాప్తు జరుపుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోకి వెళ్లడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో గురువారం (ఏప్రిల్ 23)న మొదటి దశ పోలింగ్ జరగాల్సి ఉండగా, బుధవారం కోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
జనవరిలో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ అధికారులు కొందరు కలిసి తమ దర్యాప్తు, సోదాల్లో జోక్యం చేసుకున్నారని ఈడీ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.
"ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు మధ్యలోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. దీన్ని రాష్ట్ర -కేంద్ర వివాదంగా మార్చవద్దు అని చెప్పలేరు" అని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో కలిసి ఐ-ప్యాక్ కార్యాలయం, దాని స్థాపకుడు ప్రతిక్ జైన్ నివాసంలోకి వెళ్లి, ఈడీ దర్యాప్తు జరుగుతుండగా ల్యాప్టాప్, ఫోన్, పత్రాలు తీసుకెళ్లారు.
అందుకే, "ఇది ఒక వ్యక్తి చేసిన చర్య అయినా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈడీ దాడులు రాజకీయ ఉద్దేశంతో జరిగాయని, ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ను బలహీనపరచే ప్రయత్నం చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాదించింది.


