సీఎంపై రేప్‌ ఆరోపణలు; 100 కోట్ల దావా! | Jharkhand CM Files Defamation Suit Against BJP MP Nishikanth Dubey | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీపై సీఎం 100 కోట్ల దావా!

Aug 8 2020 9:52 AM | Updated on Aug 8 2020 10:17 AM

Jharkhand CM Files Defamation Suit Against BJP MP Nishikanth Dubey - Sakshi

మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి.

సాక్షి, రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావాలో సోరెన్‌ తెలిపారు. ఈ మేరకు రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ దావాలో బీజేపీ ఎంపీతో పాటు ట్విటర్ కమ్యూనికేషన్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లను రెస్పాండెంట్‌ 2, 3 లుగా పేర్కొంటూ పార్టీలుగా సీఎం చేర్చారు.

సీఎం సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ దూబే ట్విటర్‌లో ఆరోపించారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు. ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.  

పరువునష్టం దావా వేసిన తరువాత కూడా బీజేపీ ఎంపీ హేమంత్‌ సోరెన్‌పై ట్విటర్‌ వేదికగా బాణాలు కురిపిస్తునే ఉన్నారు. ‘మీపై ముంబైలో ఒక యువతి రేప్‌ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్‌లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. 

చదవండి: యువతిని కొట్టిన పోలీస్‌, సీఎం ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement