ఢిల్లీ: హర్ముజ్ జలసంధి దిగ్భందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన వేళ బ్రిక్స్ సదస్సు వేదికగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి , ఎర్ర సముద్రం వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడం వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు.
నిన్న మే15 (గురువారం) జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం చేశారు."శాంతి ఎవరికో ఒకరికే పరిమితం కాదు స్థిరత్వం అనేది కొందరికే పరిమితం కాకూడదు,శాంతి అనేది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు" అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి, చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి " అని అన్నారు.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగకుండా చూడాలని, అలాగే ఏకపక్ష ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బ్రిక్స్ దేశాలు "ఆచరణాత్మక మార్గాలను" వెతకాలని భారత విదేశాంగ మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు.
అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో పరోక్షంగా ఇరాన్కు సూచనలు చేస్తూ జైశంకర్ ప్రసంగించారు. అయితే ఈ సదస్సులో ఇరాన్ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.
ఇరాన్ - UAE మధ్య వివాదం
కాగా ఈసమావేశంలో ఇరాన్ , యూఏఈ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాలుఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేకపోతున్నాయి.
బ్రిక్స్ కూటమి
2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా.. 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్లో చేరింది. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ జనాభాలో సుమారు 49.5% కి ప్రాతినిధ్యం వహిస్తోంది.


