నేడే ఇండియా జనబంధన్‌ | INDIA bloc are set to meet in New Delhi on 8 June 2026 | Sakshi
Sakshi News home page

నేడే ఇండియా జనబంధన్‌

Jun 8 2026 4:24 AM | Updated on Jun 8 2026 8:54 AM

INDIA bloc are set to meet in New Delhi on 8 June 2026

ఢిల్లీలో విపక్ష కూటమి కీలక సమావేశం  

భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్న నేతలు  

హాజరు కానున్న 23 పార్టీల నాయకులు  

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ‘ఇండియా జనబంధన్‌’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. 

కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్‌’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. 

అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశి్చమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్‌ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి .  

కూటమిలో రచ్చరచ్చ  
2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. 

తమిళనాడులో కాంగ్రెస్‌ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్‌ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ హాజరు కానున్నట్లు సమాచారం.  

ఐక్యతపై అనుమానాలు: బీజేపీ  
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని   పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.

ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..
ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్‌’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.

కేజ్రీవాల్‌తో మమత భేటీ 
భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్‌ చీఫ్‌తో టీఎంసీ చీఫ్‌ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్‌ బెనర్జీ వచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement