ముంబై: దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటివరకు విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని (Airfare Cap) ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి (మార్చి 23, 2026) ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అంటే ఇకపై విమాన సంస్థలు డిమాండ్ను బట్టి తమకు నచ్చినట్లుగా టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు.
ఎందుకీ నిర్ణయం?
గతేడాది డిసెంబర్లో ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాల నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వం ధరలపై తాత్కాలిక పరిమితులు విధించింది. అయితే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణ భారంగా మారింది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వాటికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ పరిమితులను తొలగించింది.
ప్రయాణికులపై ప్రభావం?
ధరల నియంత్రణ ఎత్తివేతతో ఇకపై విమాన ప్రయాణం ఖరీదు కానుంది. ముఖ్యంగా పండగలు, సెలవు రోజుల్లో.. విపరీతమైన రద్దీ ఉండే సమయంలో టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చివరి నిమిషం బుకింగ్స్.. అర్జంటుగా ప్రయాణించాలనుకునే వారు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రద్దీ లేని సమయాల్లో (Off-peak periods) ప్రయాణికులను ఆకర్షించేందుకు సంస్థలు ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది.
విమానయాన సంస్థలకు ‘డైనమిక్’ వెసులుబాటు
ఈ నిర్ణయంతో విమాన సంస్థలకు 'డైనమిక్ ప్రైసింగ్' చేసుకునే స్వేచ్ఛ లభించింది. దీనివల్ల వారు నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ధరల పరిమితిని ఎత్తివేసినప్పటికీ, విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ధరలు పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని హెచ్చరించింది. విమాన ధరల పోకడలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, రద్దీ సమయాల్లో అకారణంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.


