లోకల్‌ అడ్రస్‌ప్రూఫ్‌ ఉన్న వారికే టీకా.. | UP Govt Giving Vaccines Only to Locals of 18 Above Age Group | Sakshi
Sakshi News home page

యూపీ: లోకల్‌ అడ్రస్‌ప్రూఫ్‌ ఉన్న వారికే టీకా..

May 10 2021 8:30 PM | Updated on May 10 2021 8:34 PM

UP Govt Giving Vaccines Only to Locals of 18 Above Age Group - Sakshi

లక్నో: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మే 1నే మూడో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి.. టీకాల కొరత వల్ల చాలా చోట్ల మొదలు కాలేదు. త్వరలోనే పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్‌ వారికే వ్యాక్సిన్‌ వేస్తామని యూపీ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్‌ వేయించుకునేవారు స్థానికులం అని రుజువు చేసే పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారిక వెబ్‌సైట్‌లో సూచించారు. ఈ ఆదేశాల వల్ల చాలా మంది వలసకార్మికులు నష్టపోనున్నారు. 

వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదు. వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకునే దేశపౌరులు ఎవరైనా సరే కేవలం కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరి. ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకుంటున్నారు.. ఎక్కడ అనే విషయాలు తెలిపితే సరిపోతుందని కేంద్రం సూచించింది. కానీ యూపీ అధికారులు మాత్రం వ్యాక్సిన్‌ కావాలంటే ఆధార్‌, పాన్‌కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డ్‌లో ఏదో ఒకటి తప్పనసరిగా తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో మే 1 న 18-44 ఏళ్ల వయస్సు గలవారికి టీకా డ్రైవ్ ప్రారంభించగా.. తాజాగా మరో 11 జిల్లాల్లో మొదలు కానుంది. ఇండియాటుడే నివేదిక ప్రకారం, యూపీలో వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకున్న వారిలో అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీనివల్ల రాష్ట్రవాసులకు మొదట టీకా లభించదు. దీని గురించి  జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గానికి సమాచారం ఇచ్చారు. 

రాష్ట్ర ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తమ సొంత డబ్బును పెట్టుబడి పెట్టిందని నివేదికలో వెల్లడించారు. దాంతో రాష్ట్ర ప్రజలకు మొదట టీకాలు వేసేలా ప్రభుత్వం లోకల్‌ అడ్రస్‌ప్రూఫ్‌ తప్పనిసరి చేసింది. ఇప్పటికే నోయిడా, ఘజియాబాద్‌లో టీకా తీసుకున్న వారిలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారట. తాజా నిర్ణయంతో మొదట యూపీ వాసులకే టీకా దక్కనుంది. 

చదవండి: శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్‌?!

Advertisement
 
Advertisement
Advertisement