గతేడాది మొత్తం 830 కోట్ల యాడ్స్ తొలగింపు
వాటిలో భారత్ నుంచి 48 కోట్లకుపైగా ప్రకటనలు
జెమినై ఏఐ సాయం తీసుకుంటున్న సెర్చ్ ఇంజన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు, మోసపూరిత ప్రకటనలు పెద్ద సవాల్ విసురుతుండగా టెక్ దిగ్గజాలు ఏఐ సాయంతో వాటికి చెక్ పెడుతున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించిన వందల కోట్ల యాడ్స్ను నిలువరించినట్లు సెర్చ్ ఇంజన్ రారాజు గూగుల్ తెలిపింది.
60 కోట్ల మోసపూరిత ప్రకటనలు..
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు 90 శాతానికిపైగా వాటా ఉంది. గూగుల్ లక్షలకొద్దీ వెబ్సైట్లలో కోట్లకొద్దీ ప్రకటనలను ప్రదర్శిస్తోంది. ఆటోమేటెడ్ తనిఖీలు ఉన్నప్పటికీ ప్రకటనల సంఖ్య విపరీతంగా ఉండటంతో కొన్ని హానికరమైన యాడ్స్ కూడా ప్రదర్శితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది నిబంధనలను ఉల్లంఘించిన 830 కోట్ల ప్రకటనలను గూగుల్ నిరోధించడం లేదా తొలగించడమో చేసింది. అలాగే 2.49 కోట్ల ప్రకటనకర్తల ఖాతాలను రద్దు చేసింది.
భారత్లో నిబంధనలకు పాతరేసిన 48.37 కోట్ల యాడ్స్ను గూగుల్ తొలగించింది. 17 లక్షల ప్రకటనకర్తల ఖాతాలను నిలిపివేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, పెద్ద కంపెనీల పేర్లను వాడుకొని అవి నిజమైన కంపెనీలే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, ఇతర కంపెనీల లోగోలు, ఫొటోలు, కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకొని రూపొందించిన యాడ్స్ వాటిలో ఉన్నాయి. తాము చెక్ పెట్టిన యాడ్స్లో స్కామ్లకు సంబంధించిన 60.2 కోట్ల ప్రకటనలు, 40 లక్షల ఖాతాలు ఉన్నాయని కంపెనీ 2025 యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్లో వెల్లడించింది.
నేరగాళ్ల చేతిలోనూ ఏఐ..
ఇంత భారీ మొత్తంలో ఉన్న మోసపూరిత ప్రకటనలను మనుషులు తనిఖీ చేయడం అసాధ్యం. పైగా ఇటువంటి యాడ్స్ను పెద్ద ఎత్తున సృష్టించడానికి సైబర్ నేరగాళ్లు ఓ అడుగు ముందుకేసి జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. వాటిని రియల్ టైమ్లో గుర్తించి అడ్డుకోవడానికి జెమినై ఏఐ సాయం తీసుకుంటున్నట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఏఐ మోడల్స్ వందల కోట్ల రకాల సంకేతాలను.. అంటే ఒక అకౌంట్ ఎంత పాతది, వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది, ప్రకటనలు ఇచ్చే విధానం వంటి అంశాలను తనిఖీ చేస్తుంది. వైరస్లు లేదా హ్యాకింగ్ ముప్పులు యూజర్లకు చేరకముందే ఈ వ్యవస్థ వాటిని గుర్తించి ఆపేస్తుందని గూగుల్ తెలిపింది. 830 కోట్ల యాడ్స్లో వాటిని ఎవరూ చూడకముందే 99% కంటే ఎక్కువగా నిరోధించినట్లు కంపెనీ వెల్లడించింది.


